హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. 2,676 పరీక్ష కేంద్రాలలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతిరోజు ఉ. 9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్లాంగ్వేజి (కాంపోజిట్ కోర్స్) పరీక్ష ఉ. 9.30 గంటల నుంచి మ. 12.50 గంటల వరకు నిర్వహిస్తారు. పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయాలజికల్ సైన్స్ పరీక్షలను వేర్వేరు రోజులలో ఉ. 9.30 గంటల నుంచి 11 గంటల వరకే నిర్వహించనున్నట్టు పరీక్షల నిర్వహణ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఇదిలా ఉంటే పరీక్షలకు హాల్టికెట్లను ఆయా స్కూల్ హెడ్మాస్టర్ దగ్గర విద్యార్థులు పొందవచ్చని చెప్పారు.అలాగే www.bse.telangana. gov.in వెబ్సైట్ ద్వారా కూడా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.