హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘చావనైనా చస్తాం కానీ.. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం. కేసీఆర్ను వదిలిపోం’ అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. ఈ మధ్య ఒక పత్రికలో పార్టీ మారనున్న శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ తన నియోజకవర్గం పేరు కూడా రాశారని, తాను బాన్సువాడ ఎమ్మెల్యేగా ఈ మాట చెప్తున్నానని పునరుద్ఘాటించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవ్వరూ అమ్ముడుపోరని, ఒకవేళ ఎవరైనా ఆశపడితే వారే చేతులు కాల్చుకొని భంగపడతారని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, పలువురు అధికారులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసినప్పుడే ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు.
ప్రభుత్వాలను కూల్చడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని, ఇతర సమయాల్లో అభివృద్ధి, సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు, నాయకులు పాటుపడాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంతోషంగా ఉన్నారని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను బలపరుస్తామని, సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పాదయాత్రల పేరుతో ప్రజలను అయోమయానికి గురిచేయడం కాకుండా నిర్మాణాత్మక విమర్శలు చేయాలని, అవి కూడా వ్యవస్థాపరంగా ఉండాలని, వ్యక్తులను కించపరిచే రీతితో ఉండకూడదని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ఎక్కువ ఏమి చేస్తారో చెప్పుకోకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం సరైంది కాదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హితవు చెప్పారు.