హైదరాబాద్, వ్యవసాయ యూనివర్సిటీ జూన్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రోగ్రాంకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని అగ్రి వర్సిటీలో జరిగిన ఈ ప్రోగ్రాంలో 4,564 పాఠశాలల నుంచి 64,583 మంది విద్యార్థులు పాల్గొని, తమ ఆలోచనలను పంచుకొన్నారు. దీనికి ఐటీ,పరిశ్రమల శాఖల కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరై, ప్రదర్శనలో భాగంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆవిష్కరణలను రూపొందించేందుకు త్వరలో ఐదు వైహబ్ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఇన్నోవేషన్లో పది అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. మొదటి ప్రాజెక్టు కింద షూతో రైతులు విత్తనాలు నాటే ఆవిష్కరణను రూపొందించిన బండ్లగూడకు చెందిన విద్యార్థులకు రూ. లక్ష నగదు, రెండవది.. డాక్టర్లు రాసే ప్రిస్కిప్షన్ను ఇ-ప్రింటింగ్ చేసే ప్రాజెక్టును చేపట్టిన జీడిమెట్లకు చెందిన విద్యార్థులకు రూ. 75 వేలు, ఎమర్జెన్సీ మెడిసిన్ వెండింగ్ మెషిన్కు 3వ బహుమతి కింద 50వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం తదితరులు పాల్గొన్నారు.