హైదరాబాద్ : హైదరాబాద్లో షర్మిల అరెస్ట్ బాధించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంపై తెలంగాణ రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని నాయకులపై షర్మిల ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని 420 సీఎం అని, మగతనం లేదా మగాళ్లు కాదా అని మాట్లాడినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర మంత్రులను ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టినప్పుడు సజ్జలకు బాధ అనిపించలేదా అని సతీష్ రెడ్డి ప్రశ్నించారు. చివరకు మహిళా ఎమ్మెల్సీ అయిన కవితపైనా షర్మిల ఇష్టమొచ్చినట్టు కారుకూతలు కూశారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ నేతలను ఇష్టమొచ్చినట్టు తిట్టి పబ్లిసిటీ చేసుకుందామనుకుంటే.. తెలంగాణ ప్రజలు చూసుకుంటూ ఉండరని స్పష్టం చేశారు. ఇన్ని రోజులుగా ప్రజలు సహనంతో ఉన్నారని.. అయినా షర్మిల శృతి మించి మాట్లాడటంతో నర్సంపేట ఘటన జరిగిందన్నారు సతీష్ రెడ్డి. నిన్న తప్పుగా మాట్లాడి.. ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర పబ్లిసిటీ చేసుకునేందుకు మరోసారి షర్మిల ప్రయత్నం చేసిందన్నారు. అందుకే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. మా సీఎంపై షర్మిల తీవ్ర విమర్శలు చేసినప్పుడు.. మీరు, మీ సీఎం ఆమెకు బుద్ధి చెప్పి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని సజ్జల రామకృష్ణారెడ్డికి సూచించారు.
ఇప్పటికైనా ఎలా మాట్లాడాలో షర్మిలకు నేర్పించాలని సలహా ఇచ్చారు. ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు వారిపై లాఠీచార్జ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసేదన్నారు. గతంలో టీవీ డిబేట్లలో విమర్శలు చేసిన ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నాయకులపై వైసీపీ సర్కారు ఎలా వ్యవహరించిందో తాము కూడా చూశామన్నారు. కానీ తెలంగాణ పోలీసులు చాలా ఓపికతో ఎంత బతిమాలినా షర్మిల అక్కడి నుంచి వెళ్లిపోలేదన్నారు. అందుకే వాహనంతోపాటు అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకుంటే మంచిదని వై.సతీష్ రెడ్డి సలహా ఇచ్చారు.