హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో సీట్లను గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పాలిసెట్ ద్వారానే భర్తీచేయనున్నారు. పాలిసెట్ ర్యాంక్ల ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంతకాలంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సాధించిన ఎస్సెస్సీ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుండగా, గత ఏడాది ఎస్సెస్సీ పరీక్షలు జరగకపోవడంతో పాలిసెట్ ర్యాంక్ల ద్వారా సీట్లను భర్తీచేశారు. పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రికల్చర్, శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీలోని యానిమల్ హజ్బెండరీ కోర్సుల్లోను పాలిసెట్ ర్యాంక్ల ద్వారానే ప్రవేశాలు కల్పిస్తారు. పాలిసెట్ నోటిఫికేషన్ ఈ నెల 9న విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇక ప్రవేశపరీక్ష జూన్ 30న జరుగుతుంది. ఇతర వివరాల కోసం www.polycet.telangana.gov.in, polycets.nic.in వెబ్సైట్లను సంప్రదించాలని కన్వీనర్ డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు. సందేహాల నివృత్తి కోసం 040 -23222192 హెల్ప్లైన్ను కూడా సంప్రదించవచ్చని అన్నారు.