Telangana Police | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): తప్పు చేసినవారెవరైనా సరే.. పక్కా ఆధారాలు సేకరించి చట్టం ముందు దోషులుగా నిలబెడుతున్నారు తెలంగాణ పోలీసులు. దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరుపై సర్వేలు చేస్తున్న జాతీయ సంస్థలు సైతం తెలంగాణ పోలీసుల ప్రతిభను నివేదికల రూపంలో కొనియాడుతున్నాయి. అందుకు నిదర్శనమే ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్)-2022’ నివేదిక. ఇందులో తెలంగాణ పోలీసులు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. విధి నిర్వహణ, నిఘా, భద్రతా పనితీరులో తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థను ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్టు-2023’ కీర్తించింది.
టెన్త్, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో..
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితులను గుర్తించడంలో తెలంగాణ పోలీసులు మెరుపువేగం ప్రదర్శించారు. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హస్తం ఉన్నట్టు ఆధారాలు లభించిన వెంటనే ఆయనను అరెస్టు చేసి, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ నిబంధనలు పాటిస్తూ.. ఓ ఎంపీని అరెస్టు చేయడం తెలంగాణ పోలీసుల పనితీరుకు నిదర్శనం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కూడా ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా ఆధారాలతో 15 మందిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
సైబర్ దొంగల అంతు చూస్తూ..
కేంద్ర నిఘా సంస్థల కండ్లు కప్పి, దేశభద్రతకు ముప్పువాటిల్లేలా చెలరేగిపోతున్న సైబర్దొంగలు, డాటా లీకేజీ దొంగలను సైతం తెలంగాణ పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఇటీవల 17 కోట్ల మంది డాటాను తస్కరించి, సైబర్ దొంగలకు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. దేశ భద్రతకు భంగం కలిగించే ఇలాంటి మోసాలపై దృష్టిపెట్టిన తెలంగాణ పోలీసులు 24 రాష్ర్టాలు, ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 70 కోట్ల మంది డాటాను దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. వీటితోపాటుగా ‘క్యూనెట్’ వంటి గొలుసుకట్టు మోసాల లింకులను తెంపి భారీస్థాయిలో నష్టం జరగకుండా కాపాడారు.
ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ నటులకు సైతం నోటీసులు ఇచ్చి హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ను డ్రగ్స్తో భ్రష్టు పట్టించాలని చూసిన డ్రగ్ మాఫియాను గోవా వెళ్లి మరీ అరెస్టు చేసి చట్టం ముందు దోషులుగా నిలబెట్టారు. మహిళల భద్రత, పోలీస్స్టేషన్ల నిర్వహణ, కొత్త పోలీస్స్టేషన్ల నిర్మాణం, ప్రజల రక్షణ కోసం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను ఎన్నో జాతీయ సర్వే సంస్థలు కీర్తిస్తున్నాయి.