నాంపల్లి, అక్టోబర్ 28. వర్గీకరణ అమలు చేస్తానంటూ మాట తప్పి మాదిగలను మోసం చేస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని నక్క సునంద ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
మాదిగలను వర్గీకరిస్తామని గత కొన్నేండ్లుగా మోసం చేస్తున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో ఓడించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. అలాంటి కేసీఆర్కు మాదిగలు అండగా నిలువాలని సూచించారు. సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర కార్యదర్శి సుక్క సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.