TS Minister Satyavati Rathode | తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘విజయ భేరి’ సభ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై తెలంగాణ రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమశాఖ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ బూటకపు హామీలు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ఆదివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మాటలు, కబుర్లు చెప్పే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేతల్లో చూపుతుందని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కర్ణాటకలో అవే ప్రకటనలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిందా? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలు, తప్పుడు ప్రకటనలను తెలంగాణ మహిళలు విశ్వసించరని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తేల్చి చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెల రూ. 2500, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకు వంట గ్యాస్ సిలిండర్అందజేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ముందు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి, ఆ తర్వాత తెలంగాణలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.