TS Minister KTR | ఓటమి భయంతోనే తమ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో రౌడీ రాజకీయం సహించం అని హెచ్చరించారు. అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరుల దాడిలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజును ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. గువ్వల బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీని కోరుతున్నాం అని చెప్పారు. రేపు వారికి కూడా ఇదే పరిస్థితి రావచ్చునని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రేరేపణతోనే దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రశన్ ఆరోపించారు. మహిళలపై రేవంత్ గూండాలు దాడులు చేస్తున్నారని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొన్న ప్రభాకర్ రెడ్డి, ఇప్పుడు గువ్వల బాలరాజుపై దాడి చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుల దాడిలో బాలరాజు అనుచరులు గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కర్రు కాల్చివాతలు పెట్టాలని దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీతో ఓటమి నిరాశలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి రౌడీయిజం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం అని చెప్పారు.