TS Minister Harish Rao | హన్మకొండ, మే 27 : ఈనెల 31వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో కాజీపేట, హన్మకొండ, వరంగల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను, ప్రారంభించి, పలు పథకాలు, భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభలో హరీశ్ రావు పాల్గొననున్నారు.
మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ క్యాంప్ కార్యాలయం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, శిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు పర్యటన సందర్భంగా చేపట్టనున్న ఆయా కార్యక్రమాల వివరాలు, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. అలాగే అదేరోజు జరిగే వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.