TS Minister Harish Rao | కాంగ్రెసోళ్లను నమ్మితే కరెంటు విషయంలో తిప్పలు పడతం అని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రిస్క్ తీసుకొని తెచ్చుకోవద్దని, కారు గుర్తుకు గుద్దాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్రావు శుక్రవారం సిద్ధిపేట జిల్లా నంగునూరులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ `కరోనా వచ్చినప్పుడు కిట్లు, సూదులు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నా. సర్కారు ఆసుపత్రులను బాగు చేసుకున్నాం. మోకాలి చిప్పల మార్పిడి, డయాలసిస్, ఐసీయూ వంటి సౌకర్యాలు కల్పించుకున్నాం` అని గుర్తు చేశారు.
`గతంలో చదువుల కోసం మన పిల్లలు వరంగల్, కరీంనగర్, హైదరాబాదుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏ చదువు కావాలన్నా సిద్ధిపేట దాటి పోవాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాం. నంగునూరు మండలంలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. సిద్ధిపేటలో విద్య, వైద్యం, చదువు, రోడ్లు, మంచి నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించుకున్నాం` అని హరీశ్ రావు చెప్పారు.
రైతులకు రుణమాఫీ 75 శాతం పూర్తయిందని, మిగిలిన 25 శాతం త్వరలో చేస్తాం అని హరీశ్ రావు తెలిపారు. `అయినా అర్హులైన వారికి ఇళ్ల నిర్మాణం విషయంలో కొంత అసంతృప్తి ఉంది. ఈ సారి ఇళ్ల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఇల్లు లేనివారిని గుర్తించి పక్కా ఇల్లు కట్టించుకుందాం` అని హరీశ్ రావు అన్నారు.
`కాంగ్రెస్ పాలనలో కరువు ఏర్పడేది. కూలీ పనులు దొరక్క అవస్థలు పడేవారు. జీవాలకు గడ్డి కొని తెచ్చుకునే దుస్థితి ఉండేది. ఇప్పుడు కూలీలు దొరకని పరిస్థితి. గడ్డి పుష్కలంగా లభ్యమయ్యే పరిస్థితికి చేరుకున్నాం. నేను ఎప్పుడూ నా స్వార్ధం కోసం చూసుకోలేదు. ఎప్పుడూ సిద్ధిపేటను అభివృద్ది చేయడం కోసమే పని చేసిన. కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి ఇన్నేళ్లు ప్రభుత్వం చేసిన పనులను వివరించాలి. ఆత్మ విశ్వాసంతో ఉండాలే కానీ అతి విశ్వాసం వద్దు. సోషల్ మీడియాలో వస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాలి. సిద్ధిపేట ప్రజలు సరిహద్దు నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేయాలి.` అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.