TS Minister Gangula | కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని ఎవరెన్నీ కుట్రలు పన్నినా కరీంనగర్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండేనని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 17,18,19 డివిజన్లలో కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన మంత్రి గంగులకు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. డివిజన్ వాసులు ఆయనకు పూలమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి ఓటర్లు మోస పోవద్దన్నారు. ప్రజల నుంచి బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మి మోస పోవద్దన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాల అసమర్థ పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దూరం చేయడానికి అనేక బృహత్తర పథకాలు అమలు చేశామని, వాటిని దిగ్విజయంగా అమలు చేయడంతోనే ప్రజలు నుంచి విశేష స్పందన లభిస్తోందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి గంగుల కోరారు. పదేండ్లలో ఏ ఒక్క రోజు నియోజక వర్గ ప్రజల బాగోగులు పట్టని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వచ్చి ఎన్ని జిమ్మిక్కులను చేస్తున్నారో గమనించాలని చెప్పారు. అటువంటి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వరన్నారు. రైతు బంధును తొలగిస్తారని విమర్శించారు..
ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్, ఏదుల్ల రాజశేఖర్, సూధగోని మాధవి కృష్ణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్, జక్కుల మల్లేశం మాజీద్, నేరెళ్ల అజయ్, తొంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు