TS Minister Jagadish Reddy | సూర్యాపేట: గొర్రెల పంపిణీ పథకంతో యాదవులు ఆర్థిక పరిపుష్టి చెందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో 18 మంది లబ్దిదారులకు రూ. 31.50 లక్షల వ్యయంతో గొర్రెలను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ గొర్రెల పంపిణీ పథకం తరహాలో దేశంలో ఏ రాష్ట్రంలో పథకాలు ప్రవేశ పెట్టలేదన్నారు. మాంసం ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు మాంసాన్ని దిగుమతి చేసుకున్న తెలంగాణ ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందన్నారు.
గొర్రెల కాపరులు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు బిడ్డ సీఎంగా ఉండడంతో అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు ఎరిగిన వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసే విధంగా పథకాల రూపకల్పన చేస్తున్నారన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయ యాంత్రీకరణతో రైతును రాజుగా చేసేందుకు పాటుపడుతున్నారన్నారు.
రైతు వ్యతిరేక విధానాలు అవలంభించి ప్రజల చీత్కారానికి గురైన కాంగ్రెస్ నాయకులు మతి బ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతాంగం పట్ల అవగాహన లేని నాయకులు మూడు గంటలు కరెంట్ సరిపోతుందని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడి బిక్షం, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి శ్రీనివాసరావు, మండల పశువైద్యాధికారి గోపి, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, పిండిగ నాగేందర్, శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.