హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లుకు శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు జాఫ్రీ, టీ జీవన్రెడ్డి బిల్లుపై చర్చించారు. అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పంచాయతీ రాజ్ చట్టం 2018లో కొత్త గ్రామాల ఏర్పాటు, గ్రామాల ప్రాంతాన్ని విస్తరణ, కుదింపు, పేరు, హద్దుల మార్పు తదితర విషయాల్లో ముసాయిదా నోటిఫికేషన్ను ఉభయల సమక్షంలో ఉంచాలి. 30 రోజుల శాసన సభ పనిదినాల్లోనే కచ్చితంగా ఉండాలని పాత నిబంధనల్లో ఉంది.
అయితే.. ఈ నిబంధనతో గ్రామాల మార్పులు, చేర్పులకు సుదీర్ఘ సమయం పడుతున్నది. మూడు, నాలుగు సెషన్లు అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రక్రియ విస్తృతమైంది కావడం, కాలయాపనతో కూడుకున్నది కావడంతో చట్టంలోని 8వ షెడ్యూల్ను సవరించాలని నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి ఎర్రబెల్లి సభకు వివరించారు. ఈ సవరణ ద్వారా అసెంబ్లీలో బిల్లు తీసుకురాగానే.. ఉభయ సభల్లో చర్చ ద్వారా వెంటనే ఆమోదించేందుకు, నోటిఫికేషన్ జారీకి వీలవుతుందని సభకు తెలిపారు.
అలాగే చట్టంలోని ‘ఎన్నికల ఖర్చు పద్దును దాఖలు చేయడంలో విఫలమైతే అర్హత కోల్పోయే’ 23వ సెక్షన్ను సైతం సవరించాలని ప్రతిపాదించారు. ఈ సెక్షన్లో ‘వ్యక్తి’ అనే పదం వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవికై పోటీ చేయు అభ్యర్థులను సూచిస్తున్నది. ఈ సందిగ్ధతను తొలగించేందుకు ‘వ్యక్తి’ అనే పదానికి బదులుగా ‘సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకై పోటీ చేయు అభ్యర్థి’ అనే పదాలను చేర్చాలని నిర్ణయించారు. ఈ బిల్లుతో ఎన్నికల ఖర్చు సమర్పించని దాదాపు 32వేల మంది వార్డు సభ్యులపై అనర్హత వేటుపడనుంది. చట్టానికి ఆమోదం తెలుపాలని మంత్రి సభ్యులను కోరగా.. స్వల్పకాలిక చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.