హైదరాబాద్ మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక వసతులు కల్పించారు. పరీక్షల కోసం 1,443 కేంద్రాలు సిద్ధంచేశారు. వీటిలో 26 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. 386 ప్రభుత్వ, 206 గురుకులాలు, 840 ప్రైవేట్ కాలేజీలు, 11 ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,07,393 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
ఒకే యాజమాన్యంగా..
కార్పొరేట్ కాలేజీలైన శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకరి కాలేజీలో మరొకరు పరీక్షలు రాయకుండా ఇంటర్బోర్డు అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ రెండు విద్యాసంస్థలను ఒకే యాజమాన్యంగా పరిగణించారు. జంబ్లింగ్ అమలులో భాగంగా ఒకరి కాలేజీలో మరొకరు పడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.
మూడోరోజు నుంచే ముల్యాంకనం
పరీక్షలు ప్రారంభమైన మూడోరోజు నుంచే ముల్యాంకనం ప్రారంభిస్తారు. ఈ నెల 8న సంస్కృతం పేపర్తో ముల్యాంకనాన్ని ప్రారంభించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తర్వాత మిగతా పేపర్ల ముల్యాంకనం నిర్వహిస్తారు. పరీక్షలు మే 24వ తేదీతో ముగియనున్నాయి. జూన్ 24వ తేదీలోపు ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తున్నది.
పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు – జాగ్రత్తలు
పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలు/ ఆశావర్కర్లు ఉంటారు. వీరి వద్ద ఓఆర్ఎస్ ద్రావణం, జ్వరం, తలనొప్పి మాత్రలు. కాటన్, బ్యాండేజిలుంటాయి.
విద్యార్థులు ఉదయం 8:30 గంటలకు ముందే పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తారు
సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల బండిల్స్ను తెరుస్తారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే తిరిగి ప్యాకింగ్ చేస్తారు.
పరీక్ష కేంద్రాలను విద్యార్థి కాలేజీకి ఐదు కిలోమీటర్ల సమీపంలోనే ఏర్పాటుచేశారు.
హాల్టికెట్లను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థుల మధ్య ఒక మీటర్ భౌతికదూరాన్ని అమలుచేస్తారు. బెంచీ చిన్నగా ఉంటే ఒక్కరు.. పెద్దగా ఉంటే ఇద్దరు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి.
సెల్ఫోన్ నిబంధన కఠినతరం: ఉమర్ జలీల్
ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా, నోడల్ అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్ల వినియోగంపై నిషేధం విధించినట్టు తెలిపారు. ఇన్విజిలేటర్లు సైతం ఫోన్లు తీసుకెళ్లొద్దని ఆదేశించారు. సిబ్బంది సెల్ఫోన్లు తీసుకొస్తే.. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రపరచాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అది పనిచేస్తుందని పేర్కొన్నారు.