స్టార్టప్లకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్-2021లో గొప్ప గుర్తింపు పొందాయి. ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు ఉత్తమంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ-గవర్నెన్స్లో మనదేశం ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడంలో తెలంగాణ కీలకపాత్ర పోషించాలి.
–కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రజలకు డిజిటల్ సేవలు అందించటంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ప్రశంసించారు. ఈ-గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన అందించడంలో తెలంగాణ వినియోగిస్తున్న సాంకేతికత అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ‘24వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ-గవర్నెన్స్’ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరిశ్రమలు, వాణిజ్యం, సుపరిపాలనతో పాటు సామాజిక సంక్షేమం, అభివృద్ధి, టెక్నాలజీ ఉపయోగంలో మిగిలిన రాష్ర్టాలకంటే తెలంగాణ ముందున్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన నగరాల జాబితాలో హైదరాబాద్ వెయిటింగ్ లిస్టులో ఉన్నదని, దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
స్టార్టప్లకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని జితేంద్రసింగ్ కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్-2021లో గొప్ప గుర్తింపు పొందాయని గుర్తుచేశారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్రంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు ఉత్తమంగా ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ-గవర్నెన్స్లో మనదేశం ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడంలో తెలంగాణ కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. దేశంలో డిజిటల్ విప్లవం మొదలైందని, ప్రపంచ డాటా పవర్ హౌస్గా భారత్ అవతరించిందని చెప్పారు.
బెంగళూరు, అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టే, స్పేస్ రిసెర్చ్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లోనూ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్స్పేస్ సెంటర్’ను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు అదనంగా మరో రెండింటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2012-13లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ను మంజూరు చేస్తే, ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దాన్ని వెనక్కి తీసుకొన్నదని అన్నారు. రాష్ట్రంలో 2013-14లో రూ.57వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు ఇవాళ రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. తెలంగాణకు ఐటీఐఆర్ కేటాయించడంపై పునరాలోచన చేయాలని కోరారు.
ప్రజలకు పారదర్శకమైన, కచ్చితమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ-గవర్నెన్స్కు పెద్దపీట వేస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ-గవర్నెన్స్తో పాటు ఎం(మొబైల్)-గవర్నెన్స్పైనా దృష్టి సారించినట్టు వెల్లడించారు. 2018లో టీ-యాప్ ఫోలియోను ప్రారంభించిందని అన్నారు. ఈ-గవర్నెన్స్లో ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తున్న ఇస్తోనియా దేశ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నదని వివరించారు. ఆ దేశంలో మ్యారేజ్, ఆస్తుల క్రయవిక్రయాల కోసం తప్ప మరే పని కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లరని చెప్పారు. ఆ స్ఫూర్తితో ఈ-గవర్నెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువస్తున్నదని పేర్కొన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలను ప్రభుత్వ శాఖల పనితీరులో భాగం చేసి సమస్యలు, సవాళ్లకు చెక్ పెడుతున్నామని అన్నారు. డిజిటల్ అక్షరాస్యత సాధించటం కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం టీ-ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా 30వేల ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో 51 లక్షలు, పట్టణాల్లో 31 లక్షల ఇండ్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా మెడిసిన్ ఫ్రమ్ స్కై కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లాలో ప్రారంభించినట్టు వివరించారు. సదస్సులో కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి వీ శ్రీనివాస్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేంద్రకుమార్, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్బీఎస్ రాజ్పుత్, అవార్డులు పొందిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ-గవర్నెన్స్లో మెరుగైన సేవలు అందిస్తున్న 26 కార్యక్రమాలకు సదస్సులో గోల్డ్, సిల్వర్ అవార్డులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా 6 విభాగాల్లో 611 దరఖాస్తులు రాగా, 26 దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి అవార్డులు అందజేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) అభివృద్ధి చేసిన ‘మన ఇసుక వాహనం’ ప్రాజెక్టుకు క్యాటగిరీ-2లో సిల్వర్ అవార్డు లభించింది. రెండోరోజైన శనివారం నాటి సదస్సులో ఈ-గవర్నెన్స్పై వక్తలు ప్రసంగించనున్నారు.