హైదరాబాద్: ఇంగ్లిష్ మీడియం చదువులు.. గురుకులాలు.. గ్రంథాలయాలు.. బోధన, బోధనేతర పోస్టులకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు.. మహిళా వర్సిటీ.. సంస్కృత వర్సిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఒక స్టడీ గ్యారేజ్ అని అనాల్సిందే. అవును! తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న గురుకుల విద్య ఇప్పుడు దేశానికే రోల్మాడల్. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి పథకాన్ని తీసుకొచ్చి వాటి రూపురేఖలే మార్చేస్తున్నది. ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నది. ఎక్కడికక్కడ గ్రంథాలయాలు నెలకొల్పుతున్నది. ఇటీవలే కొత్తగా తెలంగాణ మహిళా వర్సిటీని ఏర్పాటు చేసింది. సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. ఇక, వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసేందుకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది.
నాడు భూత్బంగ్లాల్లా బడులు..
నేడు కార్పొరేట్ భవనాలు!
నాడు నెర్రెలిచ్చిన గోడలు..
నేడు కలర్ఫుల్ చిత్రాలు!
నాడు విరిగిన బెంచీలు..
నేడు అధునాతన డెస్క్లు!
నాడు ఖరాబైన నల్ల బోర్డులు..
నేడు మెరిసే డిజిటల్ స్క్రీను!్ల
నాడు విద్యాబోధనకు వలంటీర్లు..
నేడు అర్హులైన రెగ్యులర్ టీచర్లు!
ఇది స్వరాష్ట్ర పాలన విద్యావిజయం!
చదువుల తల్లికి అగ్రతాంబూలం!!
సర్కారు స్కూళ్లల్లోని 1-10 తరగతుల 26 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఏటా రూ.52 కోట్లతో ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నది.
ఉన్నత విద్యలో ఉత్తమం
సాంకేతిక విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. నిధులను పెద్ద ఎత్తున ఖర్చుపెడుతున్నది. 2014-15లో 8 భవనాల నిర్మాణాలకు రూ.20.65 కోట్లు వెచ్చింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రూ.146 కోట్లతో ప్రపంచస్థాయి ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 20 ఎకరాల్లో బాలికలు, 40 ఎకరాల్లో బాలుర కోసం ఎడ్యుకేషన్ హబ్లను నిర్మించింది.
ఆంగ్లమాధ్యమం ఆశాదీపం
తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని చూస్తున్నారు. సర్కారు బడుల్లో తెలుగు మీడియంలోనే బోధించడంతో ఇలాంటి వారికి ప్రైవేట్ చదువులే దిక్కవుతున్నాయి. దీంతో ఫీజు భారం మోయక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 26 వేల సర్కారు బడుల్లో 1-8 తరగతులకు ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రారంభించారు. రాబోయే విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి వరకు విస్తరించనున్నారు.
మాడల్ స్కూళ్లకు బడ్జెట్
తెలంగాణ మాడల్ స్కూల్స్లో 2013-14 నుంచి ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించారు. 194 మాడల్ స్కూళ్లు నడుస్తుండగా వీటిని 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేయాల్సి ఉండగా, 2016 తర్వాత కేంద్రం మాడల్ స్కూళ్లను ఎత్తివేసింది. ఫలితంగా వీటిని మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తగా, రాష్ట్రంలోని 194 మాడల్ స్కూళ్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా సొంత నిధులతో నడుపుతున్నది. 2014లో రూ.140 కోట్లున్న మాడల్ స్కూళ్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి రూ.368 కోట్లకు పెంచింది.
ముస్లిం బాలికల ప్రవేశాలు
26 శాతం వృద్ధి 2014-15, 2019-20లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాలు తెలంగాణ ముస్లిం బాలికల విద్యాభివృద్ధికి అద్దం పడుతున్నాయి.
ఆ రెండు సర్వేల గణాంకాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ చేసిన అధ్యయనంలో.. ముస్లిం బాలికల కళాశాల విద్యలో తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. గత ఏడేండ్లలో కళాశాల విద్యలో ముస్లిం బాలికల ప్రవేశాల వృద్ధి రేటు జాతీయ సగటు 3 శాతం కాగా, తెలంగాణ వృద్ధి రేటు 26 శాతంగా నమోదైంది.
మన ఊరు – మన బడి
సర్కారు బడుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు విడుతల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, 2022-23లో మొదటి విడతలో 1,240 బడులు సిద్ధమయ్యాయి. అందులో పూర్తయినవి పూర్తయినట్టు ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తం 3 విడతల్లో 3,41,265 డ్యూయల్ డెస్క్బల్లలు, 1,39,585 గ్రీన్ చాక్పీస్ బోర్డులను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 200కు పైగా విద్యార్థులున్న బడులకు సోలార్ విద్యుత్తు కనెక్షన్ ఇవ్వనుండగా, మొదటి విడతలో 1,521 బడుల్లో సోలార్ ప్యానళ్లు బిగించారు. ప్రభుత్వం ప్రకటించిన 12 అంశాలే కాకుండా పాఠశాలకు స్వాగత తోరణాలు, గ్రీనరీ, పాత్వే(నడకదారుల)ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ విద్యలో భాగంగా సర్కారు బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకోగా, మొత్తంగా 13,983 ప్యానళ్ల్లు అందజేయాలని నిర్ణయించారు. ఇటీవలే వీటిని బిగించే పనులు ప్రారంభమయ్యాయి.
మధ్యాహ్న భోజన పథకం:
సాక్షరభారత్ పథకం 2018లో ముగియగా, 2020-21 విద్యాసంవత్సరం నుంచి పఢ్నా-లిఖ్నా అభియాన్ చేపట్టారు. ఈ పథకం మూడు జిల్లాల్లోనే అమలవుతున్నది.