Group-2 Exam |గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా.. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను తొందరలోనే చెబుతామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గ్రూప్ -2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-1 తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్ -2 ఉద్యోగమే కావడంతో 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒకో ఉద్యోగానికి 705 మంది పోటీపడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబరు 2, 3వ తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో పరీక్షల నిర్వహణ, శాంతిభద్రతలు, వసతులు, సిబ్బంది అన్నీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నదని కలెక్టర్లు టీఎస్పీఎస్సీ దృష్టికి తెచ్చారు. అన్నీ ఆలోచించిన టీఎస్పీఎస్సీ… తప్పని పరిస్థితుల్లో రెండోసారి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గ్రూప్-2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా.. తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది.