హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు, విష ప్రచారాలను విశ్లేషణాత్మకంగా తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి రానున్న పది రోజుల్లో నియోజకవర్గంలో గ్రామ, మండల, మున్సిపాలిటీ, వార్డుల వారీగా సోషల్ మీడియా కమిటీలను నియమిస్తామని ఆయన వెల్లడించారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల సుమన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి రైతులే వెన్నెముక అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని, ధరణిని ఎత్తేస్తామని రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. 24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచించాలని సుమన్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ కుకలు చింపిన విస్తరాకులా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని ఆకాంక్షించారు. డిజిటల్ మీడియా నుంచి వచ్చే అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను అన్ని సోషల్ మీడియాల ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు. వ్యక్తిగత దూషణలకు దిగవద్దని, ఎవరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దని ఆయన సోషల్ మీడియా వారియర్స్కు సూచించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను వీడియోల రూపంలో, కంటెంట్ రూపంలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విసృ్తత ప్రచారం చేయాలని చెప్పారు. ఈ నెల చివరి వారంలో నియోజకవర్గంలోని 5 వేల మంది సోషల్ మీడియా వారియర్స్కు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సత్యప్రసాద్, రవీందర్, విజయానంద్, చెన్నూరు నియోజకవర్గానికి చెందిన సుమారు 500 మంది శిక్షణలో పాల్గొన్నారు.