హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సోమవారం విడుదలైన పోలీస్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషనే నిదర్శనమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్ నూతన జోనల్ వ్యవస్థను రూపొందించారని చెప్పారు. కొత్త జోనల్ విధానంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పోలీస్ నోటిఫికేషన్తో మొదలైందని అన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 ఇలా వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతాయని వివరించారు.
నిరుద్యోగ యువత కష్టపడి చదివి కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నదని, ప్రజాప్రతినిధులుగా తాము కూడా అన్ని నియోజకవర్గాల పరిధిలో కోచింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను మోదీ సర్కారు ఎప్పుడు భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. యువత బీజేపీ మాయలో పడొద్దని, కష్టపడి చదువుకోవాలనుకొన్న యువతలో ఆ పార్టీ విషబీజాలు నాటుతున్నదని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.