హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి గొప్పగొప్ప పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహాల విద్యార్థి విద్యార్థులకు నిర్వహించిన జిల్లాస్థాయి వేసవి సాంస్కృతిక పోటీ సంబరాలను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చదువు, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ముందుండాలనే ధ్యేయంతో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చించి గొప్పగొప్ప పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం తొమ్మిది గురుకులాలు మాత్రమే ఉండేవని, ఇందులో 16వేలమందికి చదువుకునేందుకు అవకాశం ఉండేదన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎంకేసీఆర్ బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు 280 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసి, 1.52లక్షల మంది పిల్లలకు విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25లక్షలు ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. బీసీలకు గొప్పగొప్ప పథకాలు అమలు చేయడంతోపాటు ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం జరిగిందన్నారు.
గతంలో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకేసారి వెయ్యికంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించలేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 83వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించిందన్నారు. ప్రతిభ ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగం వస్తుందని, ప్రతిభను నమ్ముకుని ఉన్నత వర్గాలకు ధీటుగా బీసీలు ఉద్యోగాలు పొందాలన్నారు. అనంతరం మంత్రి బీసీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనను తిలకించి విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, జిల్లా వెనుకబడిన అభివృద్ధి అధికారి రాజమనోహర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.