ఖమ్మం, జనవరి 1: ఖమ్మం నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, ఇందుకోసం రూ.1,200 కోట్లు వెచ్చించినట్టు రవా ణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ‘వాడ వాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఖమ్మం నగరంలోని 17, 27వ డివిజన్లలో పర్యటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నా యా? మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నదా? మీ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉన్నదా? అంటూ ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు.
సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నగరంలో బస్టాండ్, నగరపాలక సంస్థ కార్యాలయం, కలెక్టరేట్, ధంసలాపురంలో ఫ్లైఓవర్, నాలుగు లేన్ల రహదారులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, ఐటీ హబ్ నిర్మించామని తెలిపారు. త్వరలో ఐటీ హబ్ రెండో విడుత పనులు మొదలుపెడతామని చెప్పారు. సీఎం కేసీఆర్ నగరాభివృద్ధిని మెచ్చి ఇతర జిల్లాల యంత్రాంగానికి చెప్తున్నారని అన్నారు. హైదరాబాద్ స్థాయిలో ఎస్డీఎఫ్ నిధులతో 140 వీడీఎఫ్ రోడ్లు నిర్మించినట్టు పేర్కొన్నారు. రూ.30 కోట్లతో 42 కిలోమీటర్ల మేర డ్రెయిన్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో గుడిసెల్లో నివాసం ఉంటున్న 10 వేల మంది, వెలుగుమట్ల, వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.100 కోట్లతో గోళ్లపాడు చానల్ను అభివృద్ధి చేశామని అన్నారు. ఇకనుంచి వారంలో ఎక్కువ రోజులు ఖమ్మంలోనే అందుబాటులో ఉంటానని తెలిపారు. తనను ఎదుర్కోలేకే కొంతమంది కార్పొరేటర్లపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.