Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అసహాయులపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని రూ.4,016కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. మానవీయ పాలనకు సరికొత్త అర్థాన్నిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.దేశంలోనే అత్యధిక పింఛన్ను దివ్యాంగులకు ఇప్పటికే ఇస్తుండగా, తాజా పెంపుతో ఇతర రాష్ర్టాలు తెలంగాణ దరిదాపుల్లోనూ లేకుండా పోయాయి.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వారికి తెలంగాణ సర్కారు అందిస్తున్న పింఛన్ను రూ.4016కు పెంచారు. ఈ మేరకు పింఛన్ను రూ.3,016 నుంచి రూ. 4,016కు పెంచుతూ తెలంగాణ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని దివ్యాంగులకు అందిస్తున్న ఆసరా పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా దివ్వాంగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. రాష్ట్ర జనాభా లో మొత్తంగా 2 శాతం మంది దివ్యాంగులు ఉన్నారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ను రూ.500 నుంచి ఏకంగా రూ.1500కు పెంచారు. రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం ఆ మొత్తాన్ని రెండింతలు చేశారు. ప్రస్తుతం ప్రతి నెలా ఒక్కో దివ్యాంగుడికి రూ. 3,016 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. తాజాగా ఆ మొత్తానికి అదనంగా రూ.1000 పెంచి రూ.4016 అందివ్వనున్నది. తెలంగాణ సర్కారు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5,16,890 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది. తెలంగాణ సర్కారు రూ.3016 చొప్పున ఏటా రూ.1800.96 కోట్ల నిధులను దివ్యాంగుల పింఛన్ కోసమే వెచ్చిస్తున్నది. గడిచిన 9 ఏండ్లలో దివ్యాంగుల పింఛన్ కోసమే ఏకంగా 10,310.36 కోట్లకుపైగా నిధులను వెచ్చించింది. తాజా నిర్ణయంతో దివ్యాంగుల పింఛన్ కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.51.68 కోట్లను అదనంగా వెచ్చించనున్నది. ఈ లెక్కన సాలీన ఇకపై రూ.2400 కోట్లకుపైగా నిధులను కేవలం దివ్యాంగుల పింఛన్కే ప్రభుత్వం ఖర్చుచేయనున్నది.
అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆసరా: కేసీఆర్
ఆసరా అవసరమైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమం త్రి కేసీఆర్ వెల్లడించారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తూ వారి పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచిందని వివరించారు. పింఛన్ పెంపువల్ల రాష్ట్రంలోని దివ్యాంగులకు నెలకు రూ.205 కోట్ల 48 లక్షల ఆర్థిక ఆసరా లభించనున్నదని వివరించారు. తెలంగాణ రాకముందు కేవలం 3 లక్షల 57 వేల మంది దివ్యాంగులకు నెలకు 500 చొప్పున మాత్రమే కేవలం 17 కోట్లు మాత్రమే అందేవని, స్వయంపాలనలో అర్హులైన దివ్యాంగులను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, తద్వారా వారి సంఖ్య 5 లక్షల 11 వేల 656కు పెరిగిందని వివరించారు.
దేశానికే ఆదర్శం: మంత్రి హరీశ్రావు
మానవీయకోణంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి హరీశ్రావు కొనియాడారు. దివ్యాంగుల పింఛన్ పెంపుపై హర్షం వ్యక్తంచేస్తూ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘ ట్టానికి వేదికగా నిలిచింది. అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొ త్తాన్ని మరింతగా పెంచింది. దివ్యాంగులు ఇక మీదట రూ. 4,016 పెన్షన్ను ఈ నెల నుంచే అందుకుంటారు’ అని ఆయన పేర్కొన్నారు. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియడారు.
మానవీయతకు నిదర్శనం: మంత్రి కొప్పుల
దివ్యాంగులకు పింఛన్ల పెంపు నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ మానవీయతకు నిలువెత్తు నిదర్శనమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలి అన్నదే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. దివ్యాంగుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దివ్యాంగుల పింఛన్ను పెంచుతూ ఉత్వర్వులు విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కు మం త్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్లో ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ పాలన దివ్యాంగులకు స్వర్ణయుగం
దివ్యాంగుల సమాజం తరపున సీఎం కేసీ ఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ పాలన దివ్యాంగులకు స్వర్ణయుగం.
-దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడి
ఎక్కడాలేని విధంగా పింఛన్లు
తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచీ దివ్యాం గుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. ఎక్కడా లేని విధంగా పింఛన్ను పెంచిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– నాగేశ్వర్రావు, సలహా మండలి మెంబర్
వివిధ రాష్ర్టాల్లో దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్లు (రూ.లో)
రాష్ట్రం : పింఛన్
కర్ణాటక (కాంగ్రెస్) : 1,100
రాజస్థాన్ (కాంగ్రెస్) : 750
ఛత్తీస్గఢ్(కాంగ్రెస్) : 500
ఉత్తర్ప్రదేశ్ (బీజేపీ) : 1,000
మహారాష్ట్ర (బీజేపీ) : 300
మధ్యప్రదేశ్ (బీజేపీ) : 300
ఆంధ్రప్రదేశ్(వైసీపీ) : 3,000
బీహార్ (జేడీయూ) : 500
మిజోరం(ఎంఎన్ఎఫ్) : 100
ఒడిశా(బీజేడీ) : 200
జార్ఖండ్ (జేఎంజే) : 700
తమిళనాడు (డీఎంకే) : 1,000
కేరళ (ఎల్డీఎఫ్) : 1,300