హైదరాబాద్ : బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశంలోని బీసీలను సంఘటితం చేస్తామన్నారు. టీఆర్ఎల్పీలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే ముఠా వేణుగోపాల్తో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీసీలకు చెందిన మోదీ ప్రధాని అయితే.. తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూసిన బీసీలకు చివరికి మిగిలింది శూన్యమేనన్నారు. బీసీల ఆశలను మోదీ అడియాశలు చేశారని మండిపడ్డారు. మోదీ పాలనలో బీసీలు తీవ్ర అన్యాయానికి గురైతే.. దేశంలో బడుగు, బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ ఒక్కరే మేలు చేశారన్నారు.
బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని, దేశమంతా బీసీ కులగణన జరగాలని బీసీ ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్యతో కలిసి నాడు కేంద్రమంత్రిగా సీఎం కేసీఆర్ అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్కు వినతిపత్రం సమర్పించినట్లు గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్, ప్రస్తుతం ఎనిమిదేళ్లుగా బీసీలకు బీజేపీ మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అన్నివర్గాలు మోదీ పాలనలో అసంతృప్తితో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుల వృత్తుల వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.
జనాభా దామాషాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, కులగణన చేపట్టాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపితే కేంద్రంలోని మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వర్గాలను అణచివేయటమే పనిగా పెట్టుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీసీ నాయకులపై కక్షగట్టి ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు దిగుతుందని, ఈ విధానం మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు కావాల్సింది ఉత్సవ విగ్రహాలు కాదన్నారు. మోదీ ఉత్సవ విగ్రహంలా మారారని విమర్శించారు.
బీసీ వర్గాలకు న్యాయం చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. మోదీని ప్రధాని చేస్తున్నామని, తద్వారా దేశంలోని బీసీ వర్గాలకు మేలు జరుగుతుందని ఊదరగొట్టిన బీజేపీ చివరికి బీసీలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కేంద్రం బీసీలకు వ్యతిరేకంగా పని మండిపడ్డారు. మోదీ పేరుకే బీసీ అని.. ఆయన చేష్టలన్నీ బీసీలకు వ్యతిరేకమేనన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీసీలకు ఆత్మగౌరవం పెరిగిందన్నారు.
బీసీల మేలు కోసం సీఎం కేసీఆర్ నాయత్వంలో బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక విధానాల పై పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ బీసీ రిజర్వేషన్లకు గండికొట్టిన ప్రభుత్వం మోదీదన్నారు. బీసీలమని చెప్పుకోవడం కాదని, ఆచరణలో మేలు జరిగే విధానాలు మోదీ సర్కార్లో లేవని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం బీసీ అనుకూల విధానాలను అనుసరించాలని, ఈ వర్గాలకు సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసైనా బుద్ధితెచ్చుకోవాలని హితవు పలికారు.