Anil Kurmachalam | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడం ముమ్మాటికీ రాజకీయ కుట్రలో భాగమేనని తెలంగాణ ఎఫ్డీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఆరోపించారు. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణలో ఉండగా ఒక మహిళ హక్కులను కాలరాసి రాత్రిపూట అరెస్టు చేయడం కేంద్రంలోని బీజేపీ చేసే రాజకీయాలకు పరాకాష్ట అని తెలిపారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లే ముందు వారి ఆధీనంలో ఉన్నఈడీ, సీబీఐ అక్కడ ప్రత్యక్షమవుతాయని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేముందు ప్రధాని మోదీ ఈ దారుణానికి పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చీకటి రోజు అని అభివర్ణించారు. కడిగిన ముత్యంలా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని, ప్రజాస్వామ్యం గెలుస్తుందని అనిల్ కూర్మాచలం ధీమా వ్యక్తం చేశారు.