Teachers Transfers | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రెండు మల్టిజోన్లలో పదోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీల షెడ్యూల్ను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులుండటం, పదోన్నతులపై స్టే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మల్టిజోన్ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ), మల్టిజోన్2 పరిధిలోని జిల్లా పరిషత్తు బడుల్లోని స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) టీచర్ల బదిలీలను చేపట్టనున్నది.
మంగళ, బుధవారాల్లో అప్పీళ్లు, ర్యాంకుల దిద్దుబాటు, ఖాళీల సవరణల అప్డేట్కు అవకాశం కల్పించారు. ఈ నెల 5న తుది సీనియార్టీ జాబితాలు ప్రకటిస్తారు. 6,7న బదిలీలకు వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించారు. 8న వెబ్ ఆప్షన్లను సవరించుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్ పాయింట్లలో ఎటువంటి మార్పులుండవని అధికారులు ప్రకటించారు.
మల్టిజోన్ -1లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీల కోసం 16,498 మంది టీచర్లు దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 15,879 మంది టీచర్లు వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్నారు. వీరిలో 5,216 మంది అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరిని మినహాయిస్తే 10,684 మంది బదిలీ కావాల్సి ఉండగా, సోమవారం 9,270 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. ఇక 1,414 టీచర్ల బదిలీలు నిలిచిపోయాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఉర్దూ, ఫిజికల్ డైరెక్టర్ బదిలీలకు బ్రేక్పడటంతో 1,414 మంది బదిలీలు నిలిచిపోయాయి. పలు సాంకేతిక కారణాలతో వీరి బదిలీలను అధికారులు నిలిపివేశారు.