TS EdCET 2023 |హైదరాబాద్ : రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ ఎంట్రెన్స్ టెస్టును గురువారం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 31,725 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఏపీలో ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో మూడు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
మొదటి సెషన్ను ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మ. 2:30 గంటల వరకు, మూడో సెషన్ను సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. మొదటి సెషన్లో 10,565 మంది విద్యార్థులు, రెండో సెషన్లో 10,584 మంది, మూడో సెషన్లో 10,576 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
ఇక పరీక్షకు ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, అభ్యర్థులు పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరువాలని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ, కో కన్వీనర్ డాక్టర్ పీ శంకర్లు సూచించారు. విద్యార్థులు కోవిడ్ -19 ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని.. పరీక్షాకేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేసి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. విద్యార్థులు సొంత మాస్, గ్లౌజులు, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ను, వాటర్ బాటిల్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.