హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : 2024 -25 విద్యాసంవత్సరానికి టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదల కానున్నది. ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానున్నది. మంగళవారం ఎప్సెట్ కమిటీ మొదటి సమావేశం హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. ఎప్సెట్ షెడ్యూల్ను కన్వీనర్ డీన్కుమార్, కో-కన్వీనర్ విజయ్కుమార్రెడ్డి విడుదల చేశారు.
ఎప్సెట్ను ఇంటర్లో 100 శాతం సిలబస్కు నిర్వహిస్తామని డీన్కుమార్ వెల్లడించారు. నిరుడు ఫస్టియర్లో 70 శాతం, సెకండియర్లో 100 శాతం సిలబస్కు నిర్వహించగా, ఈ ఏడాది పూర్తిసిలబస్కు పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది ఎప్సెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకు అప్పగించిన విషయం తెలిసిందే. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్చైర్మన్ ఎస్కే మహమూద్, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ డాక్టర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ విడుదల 21-02-24
దరఖాస్తుల స్వీకరణ 26-02-24
దరఖాస్తులకు తుది గడువు 06-04-24
పరీక్షలు 09-05-24 నుంచి 12-05-24 వరకు