TS EAPCET | హైదరాబాద్ : ఈ నెల 21వ తేదీన టీఎస్ ఎప్సెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ – హైదరాబాద్ ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఎస్సెట్ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసి, 26వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ మధ్యలో విద్యార్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 500 ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు, రూ. 5000 ఆలస్య రుసుంతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 1వ తేదీ నుంచి దరఖాస్తుదారులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సులకు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది ఫస్టియర్, సెకండియర్కు సంబంధించిన 100 శాతం సిలబస్తో టీఎస్ ఎప్సెట్ను కండక్ట్ చేయనున్నారు. ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్ – తెలుగు, ఇంగ్లీష్ – ఉర్దూ భాషల్లో ఉండనుంది. తెలుగు లేదా ఉర్దూ వెర్షన్లోని ప్రశ్నల్లో తేడాలుంటే ఇంగ్లిష్ వెర్షన్నే ఫైనల్గా తీసుకుంటారు. ఇతర వివరాల కోసం 7416923578, 7416908215 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయొచ్చు.