హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) నోటిఫికేషన్ బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను బుధవారం వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రొఫెసర్ డీన్కుమార్ ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ రెండింటికి రాసే వారు ఒకేసారి దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ సారి ఎప్సెట్ పరీక్షను వందశాతం సిలబస్కు నిర్వహిస్తున్నామని, ఆయా సిలబస్ను బుధవారం విడుదల చేస్తామని చెప్పారు. ఇక విద్యార్థులు ఫీజు చెల్లించాక లావాదేవీ నెంబర్ (ట్రాన్సాక్షన్)ను జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని సూచించారు. ఈసారి దరఖాస్తుల్లో ముందుగానే ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి ఎప్సెట్ వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఎప్సెట్ పరీక్షలను గతానికి భిన్నంగా నాలుగు రోజుల్లోనే పూర్తిచేస్తున్నామని, ఆన్లైన్ సెంటర్ల సామర్థ్యాన్ని సెషన్కు 4 వేలకు పెంచామని డీన్కుమార్ తెలిపారు. గతంలో ఒక సెషన్ సామర్థ్యం 25-30వేలే ఉండగా, 40వేలకు పెంచామని చెప్పారు. ప్రశ్నపత్రాల్లో తప్పులేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు. సైబర్ నేరాల దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమయంలో బ్యాక్, రిప్రెష్ వంటి బటన్లను ఎట్టి పరిస్థితుల్లో నొక్కరాదని సూచించారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్న సెల్నెంబర్, ఈమెయిల్ ఐడీలనే వాడాలి. మధ్యలో మార్చితే ఇబ్బందులొస్తాయని తెలిపారు.
ఎప్సెట్ను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తున్నామని డీన్కుమార్ తెలిపారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ / ఇంగ్లిష్ భాషల్లోనూ పేపర్ ఇస్తామని వివరించారు. మిగతా వారికి తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో ప్రశ్నపత్రాలిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి ఎప్సెట్ మెయిల్ ఐడీ లేదా 7416923578, 7416908215 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.