హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఐదు సెషన్లలో ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో 166 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2.93 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 2.05 లక్షల మంది, ఏపీ నుంచి 88 వేల మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు బుధవారం ముగిశాయి. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించినట్టు అధికారులు ప్రకటించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఎప్సెట్ కన్వీనర్ డీన్కుమార్, కోకన్వీనర్ విజయ్కుమార్రెడ్డిలు ఎప్సెట్ నిర్వహణను పర్యవేక్షించారు. బుధవారం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షకు 91శాతం విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి 30,288 మందికి 28,073 మంది విద్యార్థులు, ఏపీలో 3,130 మందికి 2,568 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇక ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షల రెస్పాన్స్షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక ‘కీ’లను ఈ నెల 11న విడుదల చేస్తామని ఎప్సెట్ కన్వీనర్ డీన్కుమార్, కో కన్వీనర్ వ్రిజయ్కుమార్రెడ్డి తెలిపారు. కీపై అభ్యంతరాలను 13 ఉదయం 11 గంటల కల్లా తెలియజేయాలని కోరారు. కీ, రెస్పాన్స్ షీట్ల కోసం https://eapcet,tsche.ac,.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.