DSC Notification | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ గురువారం విడుదలకానున్నది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ను జారీ చేయనున్నది. వీటిల్లో గత కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1, 016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11, 062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ను జారీచేస్తారు. గ్రూప్ -1 తరహాలోనే పాత నోటిఫికేషన్ను రద్దుచేసి, కొత్త పోస్టులను కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకొన్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉన్నది. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్లో గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
రాష్ట్రంలో గత ఏడాది 5,089 టీచర్ల భర్తీకి జారీ చేసిన పాత డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.