TS Cabinet | ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్రావు మీడియాకు వివరించారు. ‘గతంలో మొదటి దఫాలో గొర్రెల పంపిణీ పూర్తిగా జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో 7.31లక్షల మంది లబ్ధిదారులను గుర్తించాం. ఇందులో 50శాతం పంపిణీ గతంలో పూర్తయ్యింది. మిగతా 50శాతం మందికి గొర్రెల పంపిణీకి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్, కేబినెట్ నిర్ణయించి, రూ.4,463కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
రెండో విడుత గొర్రెల పంపిణీ ఏప్రిల్ నెలలో ప్రారంభించి.. ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 7.31లక్షల యూనిట్లలో గతంలోనే యూనిట్లు మంజూరవగా.. మిగతా లబ్ధిదారులందరికీ ఆగస్టు నాటికి పంపిణీ చేస్తాం. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరగాలని నిర్ణయించింది. పారదర్శకంగా, వేగవంతంగా కార్యక్రమం పూర్తి చేయాలని కేబినెట్ అభిప్రాయపడింది’ అని హరీశ్రావు వివరించారు.
‘పొడు భూముల సమస్య చాలా ముఖ్యమైన సమస్య. గతంలోనే సీఎం కేసీఆర్ శాసనసభలో సమస్యపై ప్రకటించారు. అటవీశాఖ అధికారులందరూ ప్రక్రియను పూర్తి చేసి, రాష్ట్రంలోని 4లక్షల ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1, 55, 393 మందికి 4 లక్షల 903 ఎకరాలకు సంబంధించి పట్టాలు ప్రింటై.. పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 4 లక్షల ఎకరాల పంపిణీ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైనా మిగిలి ఉంటే.. వారికి సైతం పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది’ అని హరీశ్రావు వివరించారు.