హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కేంద్రం 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) వివరాలను బహిర్గతం చేసి, అన్ని రాష్ర్టాలకు అందజేయాలని కర్ణాటక బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ జస్టిస్ హెచ్ కాంతరాజ విజ్ఞప్తి చేశారు. అప్పుడే రిజర్వేషన్లు న్యాయ పరిశీలనలో నిలబడతాయని పేర్కొన్నారు. ఆ నివేదికను ఆమోదించి, అమలులోకి తేవాలని ఆకాంక్షించారు.
కర్ణాటక పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ సారథ్యంలోని బృందం శుక్రవారం కాంతరాజతో బెంగళూరులోని ఆయన స్వగృహంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తాను చైర్మన్గా ఉన్న సమయంలో 2014-15లో కర్ణాటకలో చేపట్టిన కుల గణన విధానాన్ని కాంతరాజ వివరించారు. అనంతరం తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు వికాససౌధలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రష్మీ మహేశ్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రదపటేల్, కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.