హైదరాబాద్ : శాసన సభలో నల్సార్ చట్ట సవరణ బిల్లును న్యాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1998 సంవత్సరం, తదనంతరం అవసరానికి అనుగుణంగా నల్సార్ చట్టంలో కొన్ని మార్పులు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నామన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 5A ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థులకు 20 శాతం సీట్లకు కోటాను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బిసిలు, దివ్యాంగులు, మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నామని విరించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేసినందున, 1998 నల్సార్ చట్టంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరును సాంకేతికంగా తెలంగాణ హైకోర్టుగా మార్చాల్సిన అవసరం ఉందని సభకు తెలియజేశారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థులకు అధికంగా అదేవిధంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారని తెలిపారు. స్థానిక విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న 20 శాతం కోటాను 25 శాతానికి పెంచడంతో పాటు, మొత్తం సీట్లలో సీట్లలో బీసీ/ ఓబీసీలకు రిజర్వేషన్ విధాన కోటా ప్రకారం వీరికి సీట్లు కేటాయించే విధంగా ఈ చట్టంలోని నిబంధనలు సవరించాలని కోరారు.
ఈ చట్ట సవరణ వల్ల రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థులు, బీసీ/ ఓబీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా సభను కోరారు. మంత్రి ప్రవేశ పెట్టిన ఈ బిల్లును శాసన సభ ఆమోదించింది.
ఇవి కూడా చదవండి..
మళ్లీ పెట్రో మంట.. హైదరాబాద్లో సెంచరీకి చేరువలో డీజిల్ ధర
Road accident | జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
గోదావరిలో కొట్టుకుపోయిన యువకుడు..కాపాడిన మత్స్యకారులు