హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ను గత రెండు, మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మరోసారి కేసీఆర్, కేటీఆర్లను వ్యక్తిగతంగా విమర్శిస్తే, నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్లో పడాల సతీశ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి ఏం మేలు చేసిందో చెప్పాలని కేసీఆర్ అడిగిన ప్రశ్నకు బీజేపీ నేతలు సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్కు దమ్ముంటే కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి, రాష్ర్టానికి మెడికల్ కళాశాలలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ సూచించినా కేంద్రప్రభుత్వం పైసా విడుదల చేయలేదని, అయినా బీజేపీ నాయకులకు సోయి లేదని దుయ్యబట్టారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుసేరుగా అమ్ముతూ, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను వంచిస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతానికి చేర్చిన ఘనత మోడీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. వీటి గురించి మాట్లాడని బీజేపీ నాయకులు.. కేసీఆర్పై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు రామగళ్ల సుందర్, జిల్లా నాగయ్య, శోభన్బాబు, నాగారం ప్రశాంత్, కాటం శివ, రవి, బాలు, సురేశ్, నరేశ్, మహేశ్, చిరంజీవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.