హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపడాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు చూసింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా అంతా ముందున్నదని పేర్కొన్నారు. శనివారం ఆయన ఓ టీవీ చానల్తో మాట్లాడారు. ‘దొంగతనం చేసేందుకు మఠాధిపతుల రూపంలో ఓ ముఠా వచ్చింది. వాళ్ల ఆడియోలు వెలుగుచూశాయి. వాళ్లే బాహాటంగా ఎవరితో మాట్లాడారో.. ఎవరిని ప్రలోభపెట్టారో టీవీల్లో అంతా చూపించారు.
మావాళ్లు బయటికి వచ్చి మాట్లాడితే విచారణను ప్రభావితం చేసేవిధంగా మాట్లాడుతున్నారని బీజేపోళ్లు వారి పెంపుడుకుక్కు ఈడీతో.. మరో పెంపుడు కుక్క సీబీఐతో విచారణ జరిపిస్తామంటారు. అందుకే మేము ఆ తప్పు చేయదల్చుకోలేదు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. నిజంగా మా నలుగురు ఎమ్మెల్యేలు అణిముత్యాలు.. ధీరోదాత్తులు. రోషంగల్ల తెలంగాణ బిడ్డలు ప్రలోభాలకు లొంగకుండా.. వందకోట్ల ఆఫరిచ్చినా మా పార్టీ అధినేతకు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల క్లిప్పులున్నాయి. త్వరలోనే బీజేపీ బండారం మొత్తం బయటపడ్తది. అన్నీ బయటికి వస్తాయి. ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందున్నది’ అని అన్నారు.
యాదాద్రిలో సంప్రోక్షణ చేయాలి
ప్రమాణాలు, ఇమానాలతోటే సమస్యలు పరిష్కరమైపోతే కోర్టులు, చట్టాలు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలు రేపిస్టులకే దండలు వేసి ఉరేగించి మరీ జైలు నుంచి బయటికి తీసుకొస్తున్నారని, ఇక వారు చేసే ప్రమాణాలకు ఏం విలువ ఉంటదని ప్రశ్నించారు. బీజేపీ నేత బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయటంపై మండిపడ్డారు. ‘యాదాద్రి ఆలయ నిర్వహకులను కోరుతున్నా.. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుడిని తాకడం పాపం. అక్కడ దేవాలయంలో సంప్రోక్షణ ఏమైనా చేయాల్సి ఉంటే చేయాలి. గుజరాతోళ్ల్ల చెప్పులు మోసే ఖర్మ వీళ్లకు (బీజేపీ) ఉండవచ్చు.. కానీ వీళ్లు వచ్చి దేవున్ని తాకితే దేవుడు కూడా అపవిత్రం అవుతాడు. మలినం అవుతాడు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి సంప్రోక్షణ చేసి ఇలాంటి పాపాలకు ప్రక్షాళన చేయాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
దొంగ ఎవరో ప్రజలకు అర్ధమైంది
కోర్టు విచారణలో ఉన్న కేసు గురించి మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు వస్తాయనే ‘ఎమ్మెల్యేల కొనుగోలు’పై మాట్లాడటంలేదని కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వాన్ని నడుపుతున్నవాళ్లం, మేము ఏం మాట్లాడినా విచారణను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలుచేసే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడటంలేదు. సందర్భానుసారం సీఎం కేసీఆర్ స్పందిస్తారు. నిన్ననే (శుక్రవారం) ప్రజల ముందుకు అన్ని విషయాలు వచ్చాయి. దొంగ ఎవరో.. దొర ఎవరో వారికి అర్థమైంది. బాధ్యత గల మంత్రిగా ఉన్న నేను దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా ఏమీ చెప్పను. ఎవ్వరూ తొందరపాటుగా మాట్లడొద్దని కోరాను.