హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీశ్కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ కొండంత అండగా నిలిచారు. మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా జగదీశ్ సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి తీవ్రగాయాలపాలై తుదిశ్వాస విడిచారు.
విషయం తెలిసిన వెంటనే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో జగదీశ్ మృతదేహం వద్ద నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. జగదీశ్ అంత్యక్రియల ఖర్చులతోపాటు పెద్ద కుమారుడు సచిన్ అమెరికా నుంచి వచ్చి వెళ్లడానికి విమాన టికెట్లను వద్దిరాజు రవిచంద్ర ఏర్పాటుచేశారు. సోమవారం రవిచంద్రతోపాటు బొంతు రాంమోహన్ రామంతాపూర్లోని ఇంటికి వెళ్లి జగదీశ్ సతీమణి పద్మజ, కుమారులు సచిన్, తరుణ్ను పరామర్శించి రూ.18 లక్షలు అందజేశారు. తరుణ్కు త్వరలో ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని వారికి తెలిపారు.