హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక పోలిం గ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల్లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. గురువారం రాత్రి 11 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 92 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు. కాగా, నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్కే ఏకపక్షంగా ఓట్లు పడినట్లు పలు ఎగ్జిట్పోల్స్ పేర్కొన్నాయి. దాదాపు 51 శాతం ఓట్లు టీఆర్ఎస్కే పడొచ్చని, మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని వెల్లడించాయి. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తాయని చెప్తున్నాయి. టీఆర్ఎస్కు, రెండో స్థానంలో నిలిచే బీజేపీకి మధ్య కనీసం 10 శాతం వ్యత్యాసం ఉన్నట్టు స్పష్టం చేశాయి.
అన్ని కేంద్రాల్లోంచి వెబ్కాస్టింగ్
ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. గురువారం సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన అనంతరం హైదరాబాద్లోని సీఈవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. మొదటిసారిగా మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ బూత్ల నుంచి వెబ్కాస్టింగ్ నిర్వహించి, కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించినట్టు తెలిపారు. సాయంత్రం వరకు 98 ఫిర్యాదులు వచ్చినట్టు వెల్లడించారు. ఎన్నిక ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 6,100 లీటర్ల మద్యం సీజ్ చేశామని, 191 ఎఫ్ఐఆర్లను నమోదు అయినట్టు వెల్లడించారు. కాగా, లెక్కల్లో చూపని రూ.8.26 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు.
6న ఓట్ల లెక్కింపు
ఈవీఎంలను నల్లగొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తామని వికాస్రాజ్ తెలిపారు. పట్టణంలోనే కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కౌంటింగ్ ఆఫీసర్లకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ను నియమించామని తెలిపారు. 6వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు తరలించిన తరువాత పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటిని చెక్ చేసి, సీల్ చేస్తామని, గట్టి బందో బస్తు మధ్య ఈవీఎంలను భద్ర పరుస్తామని వెల్లడించారు.