వరంగల్: టీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. వరంగల్లో చీఫ్విప్ వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు నరేందర్, సుదర్శన్ రెడ్డిలతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలు బీజేపీని నమ్మలేదని, అందుకే ఆ పార్టీకి మండలిలో స్థానం లేకుండా చేశారని విమర్శించారు.
ఆ పార్టీ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. స్వతంత్రులకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా వారికి ఇవ్వలేదంటే ప్రజలలో ఆ పార్టీకున్న స్థానాన్ని గమనించాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల ఇళ్లపై దాడులు చేయించి లబ్ది పొందాలని చూశారని ఆయన విమర్శించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని, ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. ఇప్పటికైనా విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలు వారిని స్వాగతిస్తారని వెల్లడించారు. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు బీజేపీని చిత్తుగా ఓడగొట్టడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.