హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ)ః సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా టీఆర్ఎస్ ఓటుబ్యాంకు చెక్కు చెదరలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాగా వీటిలో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇందులో మూడు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కాగా, మిగిలిన రెండు కాంగ్రెస్ సీట్లు. బీజేపీ గెలిచిన స్థానాల్లో అత్యధికంగా ఓట్లను నష్టపోయిన పార్టీ కాంగ్రెస్. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. టీఆర్ఎస్ ఓట్లలో పెద్దగా మార్పు రాలేదు.
తన ఓట్లను నిలబెట్టుకొంటున్నది. హుజూరాబాద్లో కాంగ్రెస్కు 2018లో 61 వేల ఓట్లు వస్తే.. ఉప ఎన్నికలో మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దుబ్బాకలోనూ కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి. నాగార్జునసాగర్లో కాంగ్రెస్ ఓట్లు తగ్గగా, బీజేపీకి పెరిగాయి. కాంగ్రెస్కు హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాకలో డిపాజిట్ దక్కలేదు. బీజేపీ హుజూర్నగర్, నాగార్జునసాగర్లో డిపాజిట్ కోల్పోయింది. కానీ టీఆర్ఎస్ తన పట్టును నిలుపుకొన్నది. గత నాలుగేండ్లలో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకటో స్థానం లేదా రెండో స్థానంలో నిలిచింది.