నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్, నవంబర్ 6: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలాయి. నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచిపెడుతూ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. మధ్యాహ్నం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. పటాకులు కాల్చి, మహిళలు, యువకులు ఉత్సాహంగా డ్యాన్స్లు చేశారు. ‘బీఆర్ఎస్ ఫస్ట్ విక్టరీ’ అంటూ ఫ్లైక్సీని ఏర్పాటు చేశారు. సంబురాల్లో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి, పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో జరిగిన సంబురాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాయి. ఖమ్మంలో మంత్రి అజయ్కుమార్ క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు, భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల వ్యాప్తంగానూ సంబురాలు జరిగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. జోగిపేటలో జరిగిన సంబురాల్లో, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సంబురాల్లో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. మహబూబాబాద్లోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శంకర్నాయక్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇది బీఆర్ఎస్ తొలి విజయం
ప్రభుత్వాలను కూలదోసే కుట్ర చేస్తున్న బీజేపీకి మునుగోడు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయ జైత్రయాత్రకు మద్దతు పలికిన మునుగోడు ప్రజలది విప్లవాత్మకమైన నిర్ణయం. ఇది ప్రజాస్వామ్య విజయం.. సీఎం కేసీఆర్ వెంటనే తెలంగాణ ఉందని మరోసారి రుజువైంది. ఘన విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి శుభాకాంక్షలు. – రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
బీజేపీకి చెంపపెట్టు
తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చెంపపెట్టు లాంటిది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్కు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు.
–వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
సీఎం పనితీరుకు నిదర్శనం
మునుగోడు ఉప ఎన్నిక గెలుపు సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం. ఇది ఒక అద్భుతమైన విజయం. బీఆర్ఎస్కు తొలిమెట్టు. బీజేపీ నాయకులు అహంకారంతో ప్రజలను మోసం చేయాలని చూసినా.. మునుగోడు ప్రజలు వారికి చెంప ఛెళ్లుమనిపించారు.
–బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
మునుగోడు నుంచే బీజేపీ పతనం
మునుగోడు నుంచే బీజేపీ పతనం ప్రారంభమైంది. ఆ పార్టీ మూటాముల్లె సర్దుకునే సమయం ఆసన్నమైంది. ఈ ఫలితం ఢిల్లీ పాలకులకు చెంపపెట్టులాంటింది. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించి, ఫ్లోరైడ్ పీడను దూరంచేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచారు.
– సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి స్థానం లేదు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపొందడం హర్షణీయం. ఈ విజయం ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వంపైన ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలుస్తుందని మునుగోడు ప్రజలు నిరూపించారు. బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త జైత్రయాత్రకు మునుగోడు గెలుపు నాంది కానున్నది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి స్థానం లేదని, ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ మాత్రమే అని మరోసారి స్పష్టమైంది. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు.
–దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఇది ప్రజాస్వామ్య విజయం
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ప్రజాస్వామ్య విజయం. సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు ఉన్నారని మరోసారి రుజువైంది. ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డికి శుభాకాంక్షలు. నేను ప్రచారం చేసిన చండూరులో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది బీజేపీపై బీఆర్ఎస్ తొలి విజయం. రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మరోసారి ప్రజలు తమ తీర్పుతో స్పష్టంచేశారు. ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తున్న బీజేపీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారు. మునుగోడు విజయంతో దేశంలో బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైంది.
–రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
చరిత్రాత్మక తీర్పు
మునుగోడు ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ అరాచకాలకు చరమగీతం పాడారు. బీఆర్ఎస్ పార్టీగా పరిణామం చెందాక జరిగిన తొలి ఎన్నికలో టీఆర్ఎస్కు అఖండ విజయాన్ని అందించిన మునుగోడు ఓటర్లకు కృతజ్ఞతలు. ఈ విజయానికి శ్రమించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు.
– సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్సే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నట్టు మునుగోడు నియోజకవర్గం ప్రజల తేల్చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇకనైనా బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్పై అనవసర ఆరోపణలు మానుకోవాలి.
– చామకూర మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి
ముస్లింలకు, మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపునకు కృషిచేసిన ముస్లిం సోదరులకు, ప్రత్యేకించి ఓటర్లందరికీ ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి జరగడంవల్లే ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చెరగని అభిమానం ఉన్నది. దేశంలోనే అత్యుత్తమ లౌకికవాది సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. టీఆర్ఎస్ విజయంతో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి అభినందనలు.
–మహమ్మద్ అలీ, రాష్ట్ర హోంశాఖ మంత్రి
కేసీఆర్ వెంటే తెలంగాణ
తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంటే ఉన్నదని మునుగోడు విజయంతో మరోసారి రుజువైంది. కేసీఆర్పై భరోసాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ప్రత్యర్థి అహంకారం ఓడి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఈ తీర్పు చెంపపెట్టు. మునుగోడుతో దేశంలో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైంది. ఘన విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి అభినందనలు. టీఆర్ఎస్కు పట్టం కట్టిన మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు.
–నామా నాగేశ్వరరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత
సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు
మునుగోడు ఉప ఎన్నికలో విజ యం సాధించిన సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. వీరు ద్వేషాన్ని తిరస్కరిస్తూ.. అభివృద్ధికి ఫలితాన్ని ఇవ్వడం సంతోషదాయకం.
–అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ,ఎంఐఎం అధ్యక్షుడు
దేశంలో పెనుమార్పునకు నాంది
మునుగోడు తీర్పు దేశ రాజకీయాల్లో పెను మార్పు సృష్టిస్తుంది. భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఒక ప్రాతిపదికగా నిలుస్తుంది. తెలంగాణపై బీజేపీ ఎన్ని రకాల దాడులు చేసినా ప్రజలు తిప్పికొట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తెలంగాణలో మతతత్వ, విధ్వంసకర రాజకీయాలకు తావులేదని ప్రజలు స్పష్టంగా ప్రకటించారు. గుజరాతీ గులామ్లకూ, తెలంగాణ ఆత్మగౌరవానికీ జరిగిన పోరాటంలో మునుగోడు ప్రజలు కేసీఆర్ వెంట నిలబడటం చారిత్రక సందర్భం. ఇది తెలంగాణ ప్రజల విజయం.
– దేవీప్రసాద్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
మునుగోడు గెలుపు బీఆర్ఎస్కు ఆశీర్వాదం
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం. భవిష్యత్తులో బీజేపీపై బీఆర్ఎస్ జరిపే పోరాటానికి ఈ విజయం నాంది. ఈ ఎన్నిక రాజగోపాల్రెడ్డికి, టీఆర్ఎస్కు జరిగిన పోరాటం కాదు. అమిత్షా వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా సాగింది. బీజేపీతోపాటు ఈడీ, ఐటీ, సీబీఐ కలిసికట్టుగా వచ్చినా కేసీఆర్ వెంటే ఉన్నామని తెలంగాణ ప్రజలు తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రాజగోపాల్రెడ్డి.. ఎప్పుడు సన్యాసం తీసుకుంటున్నారో చెప్పాలి.
–టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ పథకాల వల్లే టీఆర్ఎస్ గెలుపు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాయి. సీఎం కేసీఆర్ పాలనతో అక్కడ ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిషారం లభించింది. బీడు భూములన్నీ సస్యశ్యామలం అయ్యా యి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీలో చేరి ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్రెడ్డికి మునుగోడు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు.
– ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టీఎస్టీడీసీ చైర్మన్