హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో చెప్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచినట్టే మునుగోడులోనూ గెలిచితీరుతామని ధీమా వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 20 న నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ఆహ్వానించాలని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. సీఎం కేసీఆర్తో చర్చించిన తరువాత దీనిపై తుది ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పార్టీ ఇన్చార్జి రవీంద్రకుమార్, తక్కళ్లపల్లి రవీందర్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు గురువారం సమావేశమై మునుగోడు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులతో పరిస్థితిని సమీక్షించారు. హుజూర్నగర్, నాగార్జున సాగర్ మాదిరిగానే మునుగోడులోనూ గులాబీ రెపరెపలాడుతుందని స్థానిక నేతలు.. రాష్ట్ర పార్టీ నేతలకు తెలిపారు.
విపక్ష ఎమ్మెల్యేతో విసిగిపోయి
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి చుట్టపుచూపుగా కూడా రాలేదని, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయటంతో తమకు మంచిరోజులు వచ్చాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సరైన సమయంలో సహాయం చేద్దామంటే కూడా రాజగోపాల్రెడ్డి టైమిచ్చేవారు కాదని పేర్కొన్నారు. చివరికి కల్యాణలక్ష్మి చెక్కులపై ఉన్న గడువు పూర్తి అవుతుందని పిలిచినా రాలేదని.. ఇక తప్పని పరిస్థితిలో మంత్రి జగదీశ్రెడ్డిని పిలిపించుకొని చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. మునుగోడు నాలుగేండ్లు వెనక్కి పోయిందని, ఈ నేపథ్యంలోనే తాము ‘పక్కా గెలుపు’ వ్యూహాన్ని రచిస్తున్నామని ఆ నియోజకవర్గానికి చెందిన ఒక మున్సిపల్ చైర్మన్ చెప్పారు. రాజగోపాల్రెడ్డి తన కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప తమను పట్టించుకోలేదన్నారు.
పకడ్బందీ వ్యూహం.. పక్కా ప్రణాళిక
టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం.. ప్రజల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఉన్న ఆదరణ నేపథ్యంలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతలు మునుగోడు వ్యూహంపై వరుస సమావేశాలతో కసరత్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ గ్రామశాఖ, ఆ గ్రామంలోని పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవటానికి ప్రతి గ్రామానికో ఇన్చార్జిని వేసుకోవాలని, ఆ ఇన్చార్జి నేతృత్వంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం.
20న మునుగోడులో సీఎం సభ!
మునుగోడు నియోజకర్గంలో బహిరంగసభ పెట్టాలని, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ను ఆ సభకు ఆహ్వానించాలని పార్టీ శ్రేణుల, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి జగదీశ్రెడ్డిని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అవసరమనుకొంటే ఈనెల 20నే సభ నిర్వహించేలా ప్రయత్నం చేస్తానని మంత్రి జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులకు చెప్పినట్టు సమాచారం.