నల్లగొండ : మునుగోడులో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
అలాగే మర్రిగూడ బైపాస్ జంక్షన్, క్లాక్ టవర్ సెంటర్ను కూడా ప్రారంభించారు. 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మునుగోడు అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తునారు.
బీజేపీకి అక్కడ మూడో స్థానమే దక్కుతుందన్నారు.బీజేపీపై పోరాటంలో కేసీఆర్ ది రాజీలేని పోరాటం అన్నారు. బీజేపీ దుర్మార్గాలను, మోదీ అసమర్థ పాలనను ఎండగట్టడంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఐక్యం కావాలని వామపక్షాలు కోరుతున్నాయి.
బీజేపీపై పోరాటంలో టీఆర్ఎస్తో వామపక్షాలు కలిసి రావాలన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం, సీపీఐలు ప్రకటించడం ఆహ్వానించ తగ్గ పరిణామం అన్నారు. వామపక్షాలు కలిసి వస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
బండి సంజయ్ పై మంత్రి ఫైర్..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి ఫైర్ అయ్యారు. ఈడీలకు, బోడీలకు భయపడేది లేదు. కేసీఆర్ను లొంగ తీసుకోవడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. గల్లీ లీడర్ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేస్తే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు.విధి రౌడీలా బండి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఇవే చివరి ఎన్నికలు..
మోదీ ఇచ్చిన రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ తో రాజగోపాల్ రెడ్డి అహంకారంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ను వాడుకొని ఎదిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం పార్టీని, తనను ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి కింద కుక్కల్లా కాంగ్రెస్లో ఎదిగి న కోమటిరెడ్డి బ్రదర్స్.. చివరికి ద్రోహులుగా మారారని ఘాటుగా విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు కానున్నాయని జోస్యం చెప్పారు.