మునుగోడు, అక్టోబర్ 21 : మునుగోడు లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 40 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మునుగోడులో పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్రెడ్డి అవకాశవాద రాజకీయం, వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే ఈ ఉపఎన్నిక వచ్చిందని ఆరోపించారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఈ ప్రయత్నాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్రనష్టం జరుగుతుందని హెచ్చరించారు.
రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారన్నారు. అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్లో ఉంటూ.. తమ్ముడు రాజగోపాల్రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేయడం సిగ్గుచేటన్నారు. అందుకనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కోవర్టు బ్రదర్స్గా మారారని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారని తెలిపారు. కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలంటే రాజగోపాల్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఎం, సీపీఐ బలపరుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.