హైదరాబాద్ : ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ సంస్థ అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు చేపట్టనున్న ఉద్యమానికి టీఆర్ఎస్ , కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఎల్ఐసీ ఉద్యమ సన్నాహక సమావేశం లో పాల్గొని దిశానిర్దేశం చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లున్న సంస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఈనెల 29న ఉద్యమ కార్యాచరణపై ఎల్ఐసీ దేశవ్యాప్త ప్రతినిధుల సమావేశం హైదరాబాద్ కేంద్రంగా కీలకం కానుందని పేర్కొన్నారు.
ఎల్ఐసీని ప్రైవేటీకరించే కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యలను ప్రజల్లో ఎండగడతామని వినోద్ కుమార్ తెలిపారు. ఈ సన్నాహక సమావేశంలో ఎల్ఐసీ ఏజెంట్ల జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, వివిధ డివిజన్ల నాయకులు తిరుపతయ్య, రఘు, రవీంద్రనాథ్, జేఏసీ చైర్మన్ బి ఎన్ చారి, టీఆర్ఎస్ కార్మిక విభాగం ఇన్చార్జి ఎల్. రూప్ సింగ్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.