హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది. పార్టీ సోషల్ మీడియా విభాగం ఈ ఫిర్యాదు చేసింది. హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు క్రిశాంక్, జగన్, దినేష్ కోరారు.
దుబ్బాక ఎన్నికల అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడిన వీడియోలను హుజురాబాద్ ఎన్నికల సందర్బంగా వైరల్ చేయడంపై కూడా పిర్యాదు చేశారు. ఆర్ముర్ కమల దళం పేరుతో బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ వీడియోలు చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.