హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ప్రజలు,రైతులకు ప్రమాదకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినలపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ బిల్లు కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా విద్యుత్ సవరణ బిల్లు – 2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టిందన్నారు. అయితే విపక్ష పార్టీల నిరసనలతో తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం చివరికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసిందని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధలో విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్వహించిన ధర్నాలో వినోద్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ జేఏసీ ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అహంకార పూరితంగా, నియంతృత్వ పోకడలతో విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి సామాన్య ప్రజల నడ్డి విరిచే చర్యలకు పాల్పడుతోందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవితాలతో ప్రధాని మోదీ దాగుడుమూతలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే కేంద్రంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు దారి పట్టించిన బీజేపీ ప్రభుత్వం.. తాజాగా దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లు ఆమోదం పొందితే రానున్న రోజుల్లో రైతుల మోటార్లకు మీటర్లు బిగించే ప్రమాదం ఉంటుందని అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు, చిన్న తరహా పరిశ్రమలకు ఈ బిల్లు ప్రమాదకరంగా మారుతుందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.