హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): కార్యకర్తల కుటుంబాలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు శుక్రవారం తెలంగాణ భవన్లో రూ.2 లక్షల ప్రమాద బీమా ఆర్డర్ కాపీలను అందజేసిన పల్లా.. కార్యకర్తలంటే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు ఎంతో అభిమానమని, అందుకే ప్రమాద బీమా అందేలా ఏర్పాటు చేశారని తెలిపారు.
మరణించిన కార్యకర్తల పిల్లల చదువులు, ఇతర విషయాల్లోనూ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, పింఛన్లు ఇలా ప్రభుత్వపరంగా అందే సహాయానికి తోడు.. పార్టీ తరఫున బీమా కార్యకర్తలకు భరోసా కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.