హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మునుగోడు ప్రజాదీవెన బహిరంగసభ సాక్షిగా సీఎం కేసీఆర్ మరోసారి ఉద్యమకాలం నాటి ఉద్విగ్న సన్నివేశాలను గుర్తుకుతెచ్చారు. తెలంగాణ సమాజం ఒక్కతాటిపైకి రావాల్సిన అనివార్యతను గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులను కండ్లకు కట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అరాచకాలను వివరంగా చెప్పారు. ఉద్యమ సమయంలో తన ప్రసంగాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఎలా ఆలోచింపజేశారో మునుగోడు సభలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పదునైనా వాక్బాణాలతో చండ్రనిప్పులు చెరిగారు. ‘నా బలం మీరే.. నా ధైర్యం మీరే.. మీరే నన్ను బలహీన పరిస్తే.. మీరే నన్ను ఆగం చేస్తే.. నన్ను గుద్ది కిందపడేసి మునుగోడు బాయికాడ బీజేపోడు మీటరు పెడ్తడు’ అని కేసీఆర్ తనదైనశైలిలో పేర్కొన్నారు. మునుగోడు ప్రజాదీవెన సభ ద్వారా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కమాటతో కొట్టిపారేశారు. దేశంలో, రాష్ట్రంలో ఆ పార్టీ కనుచూపుమేరలో లేదని, ఆ పార్టీకి ఓటేస్తే కనగల్వాగు (మునుగోడు నియోజకవర్గంలో పారేవాగు)లో వేసినట్టేనని స్పష్టంచేశారు. ఉద్యమ సమయంలో సంధించిన వాక్బాణాలను చాలాకాలం తరువాత మునుగోడు వేదికగా సంధించారు. ‘గొర్రె గొత్కె ముడ్లె ఉన్నా.. గడ్లె ఉన్నా’ ఒక్కటేనని కేసీఆర్ పేర్కొనగానే సభలో నవ్వులు వెల్లివిరిశాయి. కత్తి ఒకనికి ఇచ్చి.. యుద్ధం ఇంకొకణ్ని చేయమంటే కుదరదని, కత్తి, యుద్ధం చేసే అవకాశం రెండూ టీఆర్ఎస్కే ఇవ్వాలని కోరారు.